
అమరావతి, 17 ఫిబ్రవరి (హి.స.)
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు ప్రారంభం కానున్నాయి. సభ కార్యక్రమాలు ప్రశ్నోత్తరాలతో ప్రారంభమవుతాయి. సభ్యులు ప్రజా సమస్యలకు సంబంధించిన పలు కీలక అంశాలను ప్రస్తావించేందుకు సిద్ధమవడంతో సభలో చర్చలు ఉత్కంఠభరితంగా సాగనున్నాయి. స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు వ్యవస్థల క్రమబద్ధీకరణపై సభ్యులు ప్రభుత్వాన్ని ప్రశ్నించనున్నారు. అలాగే ఏపీ-ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో గంజాయి అక్రమ రవాణా సమస్యపై కూడా చర్చ జరగనుంది.
నాడు–నేడు పథకం (2019–24) అమలు పరిస్థితులు, నెల్లిమర్ల నియోజకవర్గంలో హైటెన్షన్ లైన్ల సమస్యలు, ఆక్వా రైతులకు ఒకే రకమైన విద్యుత్ సబ్సిడీ వంటి అంశాలు నేడు సభ దృష్టికి రానున్నాయి. వెనకబడిన తరగతుల సంక్షేమ కార్యక్రమాలు, రాళ్లపాడు జలాశయం పనుల పురోగతి, ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ గేట్ల పునర్నిర్మాణంపై కూడా సభ్యులు వివరణ కోరనున్నారు. హజ్ యాత్రికుల సౌకర్యాలు, మహిళలపై అఘాయిత్యాల నివారణ చర్యలపై ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ