మెక్రాన్‌తో ముంబైలో మోదీ భేటీ
భారత పర్యటనలో ఉన్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మెక్రాన్‌తో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముంబైలో భేటీ అయ్యారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం రాత్రి మెక్రాన్ ముంబైకి వచ్చారు.
International ties


హైదరాబాద్, 17 ఫిబ్రవరి (హి.స.)భారత పర్యటనలో ఉన్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మెక్రాన్‌తో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముంబైలో భేటీ అయ్యారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం రాత్రి మెక్రాన్ ముంబైకి వచ్చారు. దీంతో ప్రధాని మోదీ మహారాష్ట్ర లోక్‌భవన్‌కు మంగళవారం మధ్యాహ్నం చేరుకుని మెక్రాన్‌కు సాదర స్వాగతం పలికారు. లోక్‌భవన్ వద్ద ప్రధానికి మహారాష్ట్ర, గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్ స్వాగతం పలికారు.

ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్‌తో సమావేశమయ్యేందుకు ప్రధానమంత్రి మోదీ మహరాష్ట్ర భవన్‌కు చేరుకున్నారని, ఆయనకు సాదర స్వాగతం పలికామని ఆచార దేవ్‌వ్రత్ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో తెలిపారు. మెక్రాన్ తన పర్యటనలో భాగంగా ఫస్ట్ లేడీ బ్రిగిట్టె మెక్రాన్‌తో కలిసి మంగళవారం ఉదయం తేజ్ హోటల్ వద్ద 2008 ముంబై ఉగ్రదాడి మృతులకు నివాళులర్పించారు.

మెక్రాన్ పర్యటనను స్వాగతిస్తూ ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా మంగళవారం ఉదయం పోస్ట్ పెట్టారు. మెక్రాన్‌కు స్వాగతమని, ఈ పర్యటనలో భారత్-ఫ్రాన్స్ సంబంధాలను మరో స్థాయికి తీసుకు వెళ్లేందుకు ఎదురుచూస్తున్నామని పేర్కొన్నారు. ఇరుదేశాల మధ్య చర్చలు వివిధ రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడంతో పాటు ప్రపంచ పురోగతికి దోహదం చేస్తాయని విశ్వసిస్తున్నామని అన్నారు. ముంబై, ఢిల్లీలో మెక్రాన్‌తో భేటీ అయ్యేందుకు ఎదురుచూస్తున్నట్టు మోదీ పేర్కొన్నారు.

మెక్రాన్ భారత్ పర్యటనలో భాగంగా ఈనెల 19న ఢిల్లీలో జరిగే 'ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్'లో పాల్గొంటారు. మెక్రాన్-మోదీ మధ్య జరిగే ద్వైపాక్షిక చర్చల్లో భారత్‌కు 114 రఫేల్ యుద్ధ విమానాల సరాఫరాకు ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. రూ.3.25 లక్షల కోట్ల విలువైన ఈ ఒప్పందం దేశ చరిత్రలోనే అతిపెద్ద రక్షణ ఒప్పందంగా నిలువనుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande