
అమరావతి, 18 ఫిబ్రవరి (హి.స.), :ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ) కేసులో ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సీబీఐ కోర్టులో కేసు విచారణ దశలో ఉన్నందున, తామిప్పుడు మెరిట్స్లోకి వెళ్లలేమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ట్రయల్ కోర్టులోనే తేల్చుకోవాలని ధర్మాసనం తేల్చిచెప్పింది. శ్రీలక్ష్మి పిటిషన్ను డిస్మిస్ చేస్తున్నట్లు ప్రకటిస్తూనే సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గతంలో శ్రీలక్ష్మి పిటిషన్ విచారణ సందర్భంగా మరో పిటిషన్గా భావించి స్టే ఇచ్చామని ధర్మాసనం తెలిపింది. పొరపాటున ఇచ్చిన స్టేను ఇన్నిరోజులు ఎంజాయ్ చేసినట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. ఓబుళాపురం కేసులో తనను నిర్దోషిగా ప్రకటించాలని కోరుతూ శ్రీలక్ష్మి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా, ఆ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది.
హైకోర్టు తీర్పును గతేడాది ఆగస్టు 12న శ్రీలక్ష్మి సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఆ పిటిషన్ మంగళవారం జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్, ఎన్. కోటీశ్వర్ సింగ్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. శ్రీలక్ష్మి తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ దవే వాదనలు వినిపిస్తూ.. ఈ కేసులో అప్పటి రాష్ట్ర గనుల శాఖ మంత్రి (సబితా ఇంద్రారెడ్డి), అప్పటి ప్రభుత్వ కార్యదర్శి (కృపానందం) సహా కీలకంగా ఉన్నవారు అందరూ నిర్దోషులేనని తేలిందని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. బాధ్యతలు స్వీకరించిన కొత్తలో శ్రీలక్ష్మి వద్దకు ఆ ఫైల్ వచ్చిందని గుర్తు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ