
ఢిల్లీ,18 ,ఫిబ్రవరి (హి.స.) ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ రాజకీయ వ్యూహాలు మారుతున్నట్లుగా కనిపిస్తోంది. తాజాగా బీఎస్పీ అధినేత్రి మాయావతికి దేశ రాజధాని ఢిల్లీలో టైప్-8 బంగ్లాను కేంద్రం కేటాయించింది. టైప్-8 బంగ్లాలను కేవలం కేంద్రమంత్రులు, మాజీ ఉపరాష్ట్రపతులకు కేటాయిస్తారు. అలాంటి టైప్-8 బంగ్లాను తాజాగా మాయావతికి కేటాయించడంపై పొలిటికల్గా రకరకాలుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బీజేపీతో పొత్తు పెట్టుకోబోతున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. వదంతులు వ్యాప్తి చెందడంతో మాయావతి రంగంలోకి దిగి క్లారిటీ ఇచ్చారు.
భద్రతా కారణాల దృష్ట్యా ఢిల్లీలో టైప్-8 బంగ్లాను కేటాయించారని.. ఇందులో ఎలాంటి వ్యూహాలు లేవని మాయావతి స్పష్టం చేశారు. తప్పుడు పుకార్లను కార్యకర్తలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వచ్చే ఏడాది జరిగే ఎన్నికల వ్యూహాన్ని తెలియజేశారు. ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని తేల్చి చెప్పారు. ఎన్డీఏ కూటమిలో చేరబోతున్నారంటూ వస్తున్న వార్తలను కార్యకర్తలెవరూ నమ్మొద్దని సూచించారు.
.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ