
విశాఖపట్టం, 18 ఫిబ్రవరి (హి.స.)
ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం సముద్ర తీరం అంతర్జాతీయ నౌకాదళ విన్యాసాలతో హోరెత్తింది. ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (IFR-2026)లో భారత రాష్ట్రపతి, ముక్కోటి బలగాల సర్వసైన్యాధ్యక్షురాలు ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. ఈ సందర్భంగా తీరంలో మోహరించిన 71 యుద్ధనౌకల నుంచి ఆమె గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఐఎన్ఎస్ సుమేధ నౌకపై రాష్ట్రపతి, గవర్నర్, సీఎం, డిప్యూటీ సీఎం ప్రయాణించారు. భారత నౌకాదళంతో పాటు విదేశీ నౌకాదళాల భాగస్వామ్యం భారత సముద్ర శక్తిని, అంతర్జాతీయ సహకారాన్ని ప్రపంచానికి చాటిచెప్పింది.
భారత నౌకాదళం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ముర్ము పర్యవేక్షకులుగా వ్యవహరించారు. ఫిబ్రవరి 15 నుండి 25 వరకు విశాఖ వేదికగా జరుగుతున్న విస్తృత సముద్ర సంబంధిత కార్యక్రమాల్లో భాగంగా ఈ ‘ఫ్లీట్ రివ్యూ’ను నిర్వహించారు. పలు దేశాల నుంచి నౌకలు, విమానాలు మరియు ఉన్నత స్థాయి ప్రతినిధి బృందాలు ఈ మెగా ఈవెంట్లో పాల్గొన్నాయి. ఈ చారిత్రాత్మక ఘట్టానికి ఏపీ గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు హాజరయ్యారు. వీరితో పాటు శ్రీమతి అన్నా కొణిదెల కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV