
ఢిల్లీ,19 ,ఫిబ్రవరి (హి.స.)భారతదేశంలో ఏఐ వేగం పరంగా కనిపిస్తున్న మార్పు తనను విస్మయానికి గురిచేస్తున్నట్లు ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ అన్నారు. ఒకప్పుడు సాధారణ తీరప్రాంత నగరంగా ఉన్న విశాఖపట్నం నేడు గ్లోబల్ ఏఐ హబ్గా రూపాంతరం చెందడం అద్భుతమని చెప్పారు. గురువారం న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో జరిగిన ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్’లో పిచాయ్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రపంచ ఏఐ పర్యావరణ వ్యవస్థలో భారత్ పోషిస్తున్న కీలక పాత్రను ఆయన విశ్లేషించారు.
కార్యక్రమంలో భాగంగా తన బాల్యాన్ని, విద్యాభ్యాసాన్ని గుర్తు చేసుకుంటూ పిచాయ్ భావోద్వేగానికి లోనయ్యారు. ‘నేను విద్యార్థిగా ఉన్నప్పుడు చెన్నై నుంచి ఐఐటీ ఖరగ్పూర్ వెళ్లేందుకు కోరమాండల్ ఎక్స్ప్రెస్లో ప్రయాణించేవాడిని. ఆ ప్రయాణంలో
విశాఖపట్నం ఒక నిరాడంబరమైన తీరప్రాంత నగరంగా కనిపించేది. కానీ ప్రస్తుతం అదే నగరంలో గూగుల్ 15 బిలియన్ డాలర్ల మౌలిక సదుపాయాల పెట్టుబడిలో భాగంగా ఏఐ హబ్ను ఏర్పాటు చేస్తోంది. ఆనాడు రైలులో కూర్చున్న ఏ విద్యార్థి కూడా వైజాగ్ ఒక గ్లోబల్ టెక్ హబ్గా మారుతుందని ఊహించి ఉండరు’ అని ఆయన పేర్కొన్నారు.
.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ