
అమరావతి, 20 ఫిబ్రవరి (హి.స.): అతను చదివింది న్యాయశాస్త్రం.. చేసేది మాత్రం చట్టవిరుద్ధ లావాదేవీలు. డిజిటల్ మార్కెటింగ్ పేరుతో తిరుగతుంటాడు. కొంత సమయం సీనియర్ లాయర్ వద్ద ప్రాక్టీస్ చేస్తుంటాడు. ఇటీవల యనమలకుదురులో వెలుగుచూసిన అద్దె ఖాతాల కేసులో సూత్రధారి సుబ్రమణి రాజా వెంకట్ భిన్న శైలి ఇది. చెన్నైతోపాటు పలు ప్రాంతాల్లో తన గ్యాంగ్తో మ్యూల్ ఖాతాలు తెరిపించి.. చట్టవ్యతిరేక లావాదేవీలు చేయిస్తున్నాడు. నిందితుడిని అదుపులోకి తీసుకునేందుకు చెన్నై వెళ్లిన బెజవాడ పోలీసులకు నిరాశే ఎదురైంది. రెండు రోజులున్నా.. ఆచూకీ దొరకలేదు. అతని కుటుంబ సభ్యులకు నోటీసులిచ్చి బయలుదేరారు.
డబ్బు సంపాదించాలనే ఆశతో..చెన్నై నగరం తిరివొత్తియూర్లో అద్దె ఇంట్లో ఉంటున్న వెంకట్ది పేద కుటుంబం. తండ్రి తాగుడుకు బానిసయ్యాడు. ఏ పనీ చేయకుండా ఇంటికి పరిమితమయ్యేవాడు. దీంతో వెంకట్.. త్వరగా డబ్బు సంపాదించాలన్న ఆశతో అడ్డదారి తొక్కాడు. చెన్నైలో కొందరితో కలసి అద్దె ఖాతాల లావాదేవీలు చేయడం ప్రారంభించాడు. తనకు సమీప బంధువులైన రవికుమార్, స్టీవెన్ సాయంతో విజయవాడలో కథ నడిపించేవాడు. వీరు ఇక్కడ సైబర్ పోలీసులకు పట్టుబడటంతో.. అప్రమత్తమైన రాజా వెంకట్.. ఈ నెల 9 నుంచి అదృశ్యమయ్యాడు. నిందితుడి ఇంటికి పోలీసులు వెళ్లినా ఉపయోగం లేకపోయింది. కుటుంబ సభ్యులు... న్యాయవాదులతో కలసి పోలీసుల వద్దకు వచ్చారు. వారం రోజుల సమయం ఇస్తే.. వెంకట్ను తీసుకొచ్చి అప్పగిస్తామన్నారు.
ఖాతాల వడపోత:లావాదేవీలు జరిగిన కొన్ని ఖాతాల వివరాలు బ్యాంకుల నుంచి వచ్చాయి. ఈ స్టేట్మెంట్లను పోలీసులు వడపోస్తున్నారు. వాటిల్లో పెద్ద మొత్తాల్లో లావాదేవీలు జరగలేదని తెలిసింది. ఓ ఖాతాలో గరిష్ఠంగా రూ. 16 లక్షలు మాత్రమే జరిగినట్లు గుర్తించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ