
హైదరాబాద్, 20 ఫిబ్రవరి (హి.స.)
వివాదాలకు కేరాఫ్ అడ్రస్, సంచలన
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma)మరోసారి టాలీవుడ్లో మంటలు పుట్టించారు. ఈసారి ఆయన టార్గెట్ ఏ హీరోనో, పొలిటీషియనో కాదు.. సాక్షాత్తూ టెక్నాలజీ ప్రపంచాన్ని శాసిస్తున్న AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్). భవిష్యత్తులో ఇక సినిమాలు ఉండవు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్గా మారాయి. తాజాగా ఆర్జీవీ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక మూడు నిమిషాల వీడియో క్లిప్ సినిమా ఇండస్ట్రీనే షేక్ చేస్తోంది. 'ది డోర్ బ్రదర్స్' అనే సంస్థ ఏఐ సాయంతో కేవలం ఒక్క రోజులో క్రియేట్ చేసిన ఒక విజువల్ వండర్ను చూసి వర్మ నోరెళ్లబెట్టారు. ఆ వీడియోలో జియో మాగ్నటిక్ తుఫాను కారణంగా భూమిపై జరిగే భారీ విధ్వంసాన్ని చూపించారు. వందల కోట్లు ఖర్చు పెట్టి తీసే హాలీవుడ్ సినిమాల స్థాయి విజువల్స్ అందులో ఉన్నాయి.
దీనిపై ఆర్జీవీ స్పందిస్తూ.. కేవలం ఒక్క రోజులోనే, ఎటువంటి నటీనటులు, భారీ సెట్స్ లేకుండా ఏఐ ఈ అద్భుతాన్ని సృష్టించింది. ఇది చూశాక సినిమాలు అనే ప్రక్రియకు ముగింపు వచ్చేసిందని నమ్మి తీరాల్సిందే” అని ఆర్జీవీ రాసుకొచ్చారు. రాబోయే రోజుల్లో డైరెక్టర్లు, యాక్టర్ల అవసరం లేకుండానే సినిమాలు వచ్చేస్తాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్జీవీ ఇక్కడితో ఆగకుండా మరో ట్వీట్లో తనదైన స్టైల్లో విరుచుకుపడ్డారు. ప్రస్తుతం మన ప్రపంచం ఎదుర్కొంటున్న రెండు అతిపెద్ద సమస్యల్లో ఒకటి నేచురల్ స్టూపిడిటీ (సహజ మూర్ఖత్వం) కాగా, రెండోది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
మనుషుల తెలివితేటల కంటే ఏఐ వేగంగా ఎదగడం భవిష్యత్తులో ఉపాధికి పెను ముప్పు అని ఆయన హెచ్చరించారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..