
అమరావతి, 20 ఫిబ్రవరి (హి.స.)వైసీపీ ఎమ్మెల్సీలు శాసనమండలిలో కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి చిత్రపటాలను అవమానించారని, ఇది క్షమించరాని పాపమని ఏపీ మంత్రి నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేత జగన్కు దేవుడంటే భక్తి, భయం లేవని, హిందువుల మనోభావాలంటే అస్సలు లెక్కేలేదని ఆయన మండిపడ్డారు.
తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ అయ్యిందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ఆరోపణలకు నిరసనగా వైసీపీ సభ్యులు శుక్రవారం శాసనమండలికి శ్రీవారి చిత్రపటాలతో హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు బూట్లు, చెప్పులతోనే స్వామివారి చిత్రపటాలను పట్టుకుని ప్రదర్శించారని, సభ ముగిశాక వాటిని అక్కడే వదిలేసి వెళ్లారని లోకేశ్ ఆరోపించారు.
ఈ ఘటనపై లోకేశ్ తీవ్రంగా స్పందించారు. శ్రీవారికి చేసిన మహా పాపం కప్పిపుచ్చుకోవడానికి మహాపరాధం చేశావు జగన్. మీ వైసీపీ ఎమ్మెల్సీలు బూట్లు, చెప్పులతో వెంకటేశ్వర స్వామి చిత్రపటాలు పట్టుకుని మహాపరాధం చేశారు. అంతే కాకుండా, కౌన్సిల్లో ప్రదర్శించిన శ్రీవారి ఫొటోలు అక్కడే విసిరేసి వెళ్ళిపోవడం క్షమించరాని పాపం. వెంకన్నతో పెట్టుకోవద్దు జగన్! అంటూ లోకేశ్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ఈ మేరకు తన విమర్శలకు ఆధారంగా నారా లోకేశ్ వీడియోను కూడా పంచుకున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV