
అహ్మదాబాద్, 21 ఫిబ్రవరి (హి.స.)
ప్రేమపెళ్లిళ్ల విషయంలో గుజరాత్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. లవ్ జిహాద్ మరియు ప్రేమ పెళ్లి పేరుతో మోసం చేసేవాళ్లను కట్టడి చేసే ప్రణాళిక రచించింది. తల్లిదండ్రులకు తెలియకుండా చేసుకునే ప్రేమ వివాహాలు, మతాంతర వివాహాల గురించి ఇరు వైపుల తల్లిదండ్రులకు తెలియజేయాల్సిన అవసరాన్ని గుర్తించి కొత్త నిబంధనలు తీసుకువచ్చింది. దీంతో ప్రేమ పెళ్లి చేసుకునేవాళ్లు తమ వివాహం గురించి తల్లిదండ్రులకు తెలుసో లేదో దరఖాస్తులో పేర్కొనాల్సిందే.
వధూవరులు దరఖాస్తులో ఇచ్చిన వివరాల ఆధారంగా 10 రోజుల్లోగా ఇరువురు తల్లిదండ్రులకు సమాచారం అదించడం రిజిస్ట్రార్ బాధ్యత. కొత్తగా తీసుకువచ్చిన ఈ నిబంధనల ప్రకారం దరఖాస్తు తేదీ నుండి మ్యారేజ్ సర్టిఫికెట్ జారీ వరకు 30 రోజుల వ్యవధిని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఇక ఇటీవల కాలంల ప్రేమ వివాహాల పేరుతో మోసాలు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియా పరిచయాలు, ఇతర మార్గాల ద్వారా కొందరు వల విసిరి పెళ్లి చేసుకుని మోసం చేస్తున్నారు. మరోవైపు లవ్ జిహాదీ పేరుతో మతమార్పిడులకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే అలాంటి వివాహాలను కట్టడి చేయాలని గుజరాత్ ప్రభుత్వం నిర్ణయించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు