
హైదరాబాద్, 21 ఫిబ్రవరి (హి.స.)
గుర్తింపు లేని కళాశాలలో అనుమతులు రద్దు చేసి తక్షణమే చర్యలు తీసుకోవాలని టీజేఎస్ఎఫ్ డిమాండ్ చేసింది. ఈ మేరకు శనివారం తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నాంపల్లి ఇంటర్ బోర్డు కార్యాలయాన్ని ముట్టడికి యత్నించారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన విద్యార్థులు కార్యాలయం గేటు పైకి ఎక్కి లోపలికి చొచ్చుకు పోవడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. కార్యాలయం గేటు ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేసి ప్రత్యేక వాహనంలో తరలించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అనుమతులు లేని విద్యాసంస్థలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న 300 మంది విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వకుండా ఇంటర్ బోర్డు అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. అంతేకాకుండా విద్యార్థుల జీవితాలతో ఇంటర్ బోర్డు అధికారులు చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. తక్షణమే 300 మంది విద్యార్థులకు హాల్ టికెట్లు ఇచ్చి, ఎగ్జామ్ రాసేందుకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు