
ముంబై, 21 ఫిబ్రవరి (హి.స.)
ఆర్ఎస్ఎస్ 2014 పరువునష్టం కేసులో రాహుల్ గాంధీకి రిలీఫ్ లభించింది. ముంబై భీవండి కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఆర్ఎస్ఎస్ కార్యకర్త రాజేష్ కుంటే 2014లో దాఖలు చేసిన పరువు నష్టం కేసులో భాగంగా రాహుల్ గాంధీ భీవండీ కోర్టు ఎదుట హాజరయ్యారు.
గతంలో గ్యారెంటర్గా ఉన్న శివరాజ్ పాటిల్ చాకూర్కర్ మరణించడంతో, ఆయన స్థానంలో మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ హర్షవర్ధన్ సప్కాల్ను కొత్త గ్యారెంటర్గా రాహుల్ గాంధీ నియమించారు. సప్కాల్ను హామీదారుగా కోర్టు అంగీకరించింది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ కౌన్సెల్ నారాయణ్ అయ్యర్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసు ఫాస్ట్ ట్రాక్ ప్రాతిపదికన సాగుతోందని, న్యాయవ్యవస్థపై పూర్తి విశ్వాసంతో తాము కోర్టుకు సహకరిస్తున్నామని తెలిపారు. క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని, విచారణను ఎదుర్కొని నిజాన్ని కోర్టు ముందు ఉంచేందుకు సిద్ధంగా ఉన్నట్లు రాహుల్ గాంధీ ఇప్పటికే సుప్రీంకోర్టుకు తెలిపారని ఆయన పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు