
కర్నూల్, 21 ఫిబ్రవరి (హి.స.)
: వైసీపీ నేతలు చెప్పులు వేసుకుని వెంకన్న ఫొటోలను ప్రదర్శించడం బాధాకరమని మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. శనివారం కర్నూల్ లోను వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని శుద్ధి చేసి, అనంతరం పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తిరుమల నెయ్యిలో కల్తీ జరిగింది వాస్తవమేనని, అందుకే జగన్ అడ్డంగా వాదిస్తున్నారన్నారు. చేసిన తప్పును ఒప్పుకుని జగన్ తిరుమలకు వెళ్లి క్షమాపణలు అడగాలని డిమాండ్ చేశారు. తిరుమల వెంకన్నతో పెట్టుకుంటే ఆయనే శిక్షిస్తారన్నారు.
రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సైతం ఈ ఇష్యూపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ.. తిరుమలలోనే కాకుండా శ్రీశైలం లడ్డూలోనూ కల్తీ నెయ్యిని సరఫరా చేసి.. భక్తుల నమ్మకాన్ని వొమ్ముచేసిందని విమర్శించారు. విజయ డెయిరీని కాదని రాజేష్ కార్పొరేషన్ ద్వారా కల్తీనెయ్యి సరఫరా చేయడం మహాపాపమన్నారు. శ్రీశైలం వంటి పుణ్యక్షేత్రాన్నే వైసీపీ భ్రష్టుపట్టించిందని దుయ్యబట్టారు. బ్రహ్మోత్సవాల్లో అలజడి సృష్టించేందుకు కుట్రలు పన్నినవారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. భక్తుల ఆగ్రహాన్ని ఎదుర్కోలేకనే వైసీపీ నేతలు నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. దేవాలయాల పవిత్రతను కాపాడటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, భక్తుల విశ్వాసంతో ఆడుకున్న వైసీపీకి.. ప్రజలే బుద్ధిచెప్తారన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV