
అమరావతి,, 22 ఫిబ్రవరి (హి.స.)వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి బాలవీరాంజనేయ స్వామిసంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష హోదా కూడా దక్కని వైసీపీ నేతలు.. శ్రీ వేంకటేశ్వర స్వామి పేరుతో రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇవాళ(ఆదివారం) ప్రకాశం జిల్లాలో పర్యటించిన ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కెమికల్స్తో తయారు చేసిన కృత్రిమ నెయ్యిని తిరుమల లడ్డూలో వాడారని ఆరోపించారు.
శాసనమండలిలో చెప్పులు, బూట్లు వేసుకుని వేంకటేశ్వర స్వామి ఫొటోలు తీసుకువచ్చారని ఫైర్ అయ్యారు మంత్రి. శ్రీవారి చిత్రపటాలు పట్టుకుని జై జగన్ అంటూ నినాదాలు చేశారన్నారు. వైసీపీ హయాంలో రామతీర్థంలో రాముడి విగ్రహం తల నరికేశారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు రామతీర్థం వెళ్తుంటే అడ్డుకున్నారని ఆగ్రహించారు. దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తే పతనమైపోతారని హెచ్చరించారు.
వైవీ సుబ్బారెడ్డిని టీటీడీ ఛైర్మన్గా చేస్తే 'జగన్మోహన్ రక్షకా గోవిందా' అని నినాదాలు చేశారని బాలవీరాంజనేయ స్వామి ప్రస్తావించారు. జగన్ హయాంలో భారతి అకౌంట్కు రూ.570 కోట్లు దోచిపెట్టారని ఆరోపించారు. చేసిన తప్పులు కప్పి పుచ్చుకునేందుకు హెరిటేజ్పై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తప్పుడు ఆరోపణలు చేస్తే ప్రజలు క్షమించరని హెచ్చరించారు. తిరుమల మాడ వీధుల్లో జగన్ చెప్పులతో తిరిగారని ఫైర్ అయ్యారు. అన్యమతస్థులు డిక్లరేషన్పై సంతకం పెట్టాల్సి వస్తుందని.. జగన్ తిరుమల వెళ్లడం మానుకున్నారని ఆరోపించారు. ఏడుకొండల స్వామి పేరును జగన్ అండ్ కో రాజకీయాలకు వాడటం సరికాదని మంత్రి హితవు పలికారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్