
అమరావతి, 22 ఫిబ్రవరి (హి.స.)
ఢిల్లీలో జరిగిన ఇండియా ఏఐ సమ్మిట్లో యూత్ కాంగ్రెస్ నిరసనపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ గట్టి కౌంటర్ ఇచ్చారు. పెట్టుబడుల వాతావరణాన్ని దెబ్బతీసిన జగన్ ఇప్పుడు దేశ ప్రతిష్ఠ గురించి మాట్లాడటం కపట ప్రేమను ప్రదర్శించడమేనని లోకేశ్ తీవ్రంగా విమర్శించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదిక ఎక్స్ లో పోస్టు పెట్టారు.
ఢిల్లీ ఏఐ సదస్సులో జరిగిన నిరసన దేశానికి తలవంపులు తెచ్చిందని, రాజకీయ విబేధాలున్నా ప్రపంచ వేదికపై దేశ గౌరవాన్ని కించపరచవద్దని జగన్ వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన లోకేశ్, జగన్ గతాన్ని గుర్తు చేస్తూ పలు ఆరోపణలు చేశారు. ‘భారత్లో పెట్టుబడుల వాతావరణానికి అందరికంటే ఎక్కువ నష్టం కలిగించిన వ్యక్తి, ఇప్పుడు నకిలీ సానుభూతి ప్రదర్శిస్తున్నారు. ఈ కపటత్వం ఆశ్చర్యం కలిగిస్తోంది’ అని లోకేశ్ తన పోస్టులో పేర్కొన్నారు.
ఈ సందర్భంగా జగన్ గతంలో తీసుకున్న పలు నిర్ణయాలను లోకేశ్ ఏకరువు పెట్టారు. 2017లో ఇన్వెస్ట్మెంట్ సదస్సును అడ్డుకునేందుకు విమానాశ్రయంలో ధర్నా చేశారు. 2019లో అంతర్జాతీయ పెట్టుబడిదారులతో కుదిరిన విద్యుత్ ఒప్పందాలను రద్దు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV