
ఉజ్జయిని, 28 ఫిబ్రవరి (హి.స.)
భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్(Jagadeep dhanker) ఇవాళ మధ్యప్రదేశ్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉజ్జయినిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మహాకాళేశ్వరుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. దేశాభివృద్ధి, సామాజిక సామరస్యంపై కీలక వ్యాఖ్యలు చేశారు. మనమందరం అహంకారం, ద్వేషం, ప్రతీకారేచ్ఛ, అసూయ వంటి దుర్గుణాలకు అతీతంగా ఎదగాలని అన్నారు.
ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నా అని ఆయన ఆకాంక్షించారు. భారతదేశం నిరంతరం అభివృద్ధి పథంలో పయనించాలని, దేశం మరింత సుభిక్షంగా మారాలని తాను భగవంతుడిని ప్రార్థించినట్లుగా ధన్కర్ తెలిపారు. తాను స్వయంగా రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడినని, మన దేశం కోసం రైతులు, సైనికులు చేస్తున్న త్యాగాలు వెలకట్టలేనివని అన్నారు. వారి సేవలకు దేశం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందని కొనియాడారు. సమాజంలోని ప్రతి ఒక్కరి క్షేమం కోసం, దేశ శ్రేయస్సు కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని జగదీప్ ధన్కర్ పిలుపునిచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..