
న్యూఢిల్లీ, 28 ఫిబ్రవరి (హి.స.)
పశ్చిమాసియా (West Asia)లో
ఒక్కసారిగా పెరిగిన ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై తీవ్ర ప్రభావం పడింది. ఇవాళ ఢిల్లీ (Delhi) నుంచి ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్ (Tel Aviv)కు బయలుదేరిన ఎయిరిండియా విమానం (AI 139) ఇజ్రాయెల్ గగనతలం మూసివేయబడటంతో మధ్యలోనే వెనక్కి తిప్పి ముంబైకి దారి మళ్లించారు. ఇరాన్పై తాము ముందస్తు దాడి చేసినట్లుగా ఇజ్రాయెల్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించిన కొద్దిసేపటికే ఈ పరిణామం చోటుచేసుకుంది. భద్రతా కారణాల దృష్ట్యా ఇజ్రాయెల్ ప్రభుత్వం తమ గగనతలాన్ని పౌర విమానాల కోసం తాత్కాలికంగా మూసివేస్తున్నట్లుగా ప్రకటించింది. దీంతో గాలిలో ఉన్న విమానాలను తక్షణమే సురక్షిత ప్రాంతాలకు మళ్లించాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
ప్రయాణికుల భద్రతపై ఎయిరిండియా ప్రకటన..
విమానం ముంబైలో సురక్షితంగా ల్యాండ్ అయిందని, ప్రయాణికులందరూ క్షేమంగా ఉన్నారని ఎయిర్ ఇండియా ప్రతినిధి తెలిపారు. ప్రయాణికులకు అవసరమైన బస సౌకర్యాలు, తదుపరి ప్రయాణ ఏర్పాట్లపై ఎయిరిండియా యాజమాన్యం కసరత్తు చేస్తోంది. ఉద్రిక్తతలు తగ్గే వరకు టెల్ అవీవు నడిచే విమాన సర్వీసులపై స్పష్టత లేదని అధికారులు పేర్కొన్నారు. యుద్ధ వాతావరణం వల్ల గగనతలం మూసివేయడంతో మరోవైపు ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు