
ఢిల్లీ, 28 ఫిబ్రవరి (హి.స.)
లెబనాన్లోని హిజ్బుల్లా ప్రధాన
కార్యాలయంపై ఇజ్రాయెల్ (Israel) సేనలు గగనతలం నుంచి బాంబుల వర్షం కురిపించాయి. ఈ క్రమంలోనే ఇరాన్ (Iran) సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ (Ayatollah Ali Khamenei) అత్యంత సురక్షితమైన రహస్య ప్రాంతానికి తరలించినట్లుగా అంతర్జాతీయ వార్తా సంస్థలు వెల్లడించాయి. అయితే హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా లక్ష్యంగా ఇజ్రాయెల్ జరిపిన దాడుల తర్వాత, ఇరాన్ అప్రమత్తమైంది. ఖమేనీ భద్రతపై ఆందోళనల నేపథ్యంలో, ఆయనను దేశంలోని ఒక రహస్య బంకర్లోకి ప్రాంతానికి తరలించినట్లు సమాచారం.
కాగా, ఈ క్లిష్ట సమయంలో ఇరాన్ ప్రభుత్వం హిజ్బుల్లా, ఇతర ప్రాంతీయ మిత్రపక్షాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. ఇజ్రాయెల్ చర్యలకు ఎలా ప్రతిస్పందించాలనే అంశంపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు తనను సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు వార్తలు వస్తున్న తరుణంలోనే ఖమేనీ ఓ ప్రకటన విడుదల చేశారు. ఇజ్రాయెల్ దురాగతాలను ఎదిరించేందుకు ముస్లిం దేశాలన్నీ హిజ్బుల్లాకు అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు.
అదేవిధంగా తమ పౌరులకు ముప్పు కలిగించే వారు ఎక్కడ ఉన్నా వదిలిపెట్టబోమని ఇజ్రాయెల్ సైన్యాధిపతి హెర్జీ హలేవి (Herzi Halevi) హెచ్చరించారు. ఈ ప్రకటన ఇరాన్ అగ్రనేతలను కూడా లక్ష్యం చేసుకునే అవకాశం ఉందన్న సంకేతాలను స్పష్టంగా తెలియజేస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..