
రాజమండ్రి 28 ఫిబ్రవరి (హి.స.)రాజమండ్రిలో కల్తీ పాల ఘటనలో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న రోగుల ఆరోగ్య పరిస్థితి రోజురోజుకు క్షీణిస్తోంది. వెంటిలేటర్పై డయాలసిస్ చికిత్స పొందుతున్న రోగుల సంఖ్య 11కి పెరిగింది. మొత్తం 15 మంది బాధితులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఎనిమిది మంది ఆరోగ్య పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా మారింది. 11 మందికి వెంటిలేటర్పై డయాలసిస్ సేవలు అందిస్తున్నారు. మరోవైపు కల్తీ పాల బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇవాళ హైదరాబాద్ నుంచి ప్రముఖ వైద్య నిపుణులు రాజమండ్రికి రానున్నారు. అలాగే, 10 మంది బాధితులకు ముంబై నుంచి తెప్పించిన ప్రత్యేక ఇంజెక్షన్లతో చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు వెల్లడించారు.
అయితే, కల్తీ పాల బాధితులకు రాజమండ్రిలో మెరుగైన వైద్యం అందిస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అందుకోసం హైదరాబాదు నుంచి వైద్య నిపుణుల బృందాన్ని రప్పిస్తున్నాం.. ఈరోజు ఎఫ్ఎంసీ రిపోర్టు రావచ్చు.. నాలుగు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న 15 మంది బాధితులకు ఎంత ఖర్చు అయినా పెట్టమని ముఖ్యమంత్రి చెప్పారు.. సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు కల్తీ పాల బాధితుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తున్నారు.. ముఖ్యమంత్రి స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ