
: ఢిల్లీ, 10,మార్చి (హి.స.)లోక్సభ స్పీకర్ ఓం బిర్లా (Lok Sabha Speaker Om Birla)పై విపక్షాలు అవిశ్వాస తీర్మానం తీసుకొచ్చాయి. ఈ తీర్మానాన్ని కాంగ్రెస్ ఎంపీ మహమ్మద్ జావెద్ మంగళవారం సభలో ప్రవేశపెట్టారు. అనంతరం దీనిపై చర్చ ప్రారంభమైంది. ఇందుకోసం 10 గంటల సమయం కేటాయించారు. అనంతరం తీర్మానంపై ఓటింగ్ నిర్వహించనున్నారు.
ఈ తీర్మానం (No-Confidence Motion)పై చర్చ వేళ సభను నడిపేందుకు ప్రత్యేక సభాపతిని నియమించాలని విపక్షాలు కోరాయి. ఇందుకు అంగీకరించిన కేంద్రం.. సీనియర్ ఎంపీ, ఛైర్పర్సన్స్ ప్యానెల్ సభ్యుడు జగదాంబికా పాల్ను నియమించింది. ఆయన నేతృత్వంలో అవిశ్వాస తీర్మానంపై లోక్సభలో చర్చ కొనసాగుతోంది.
రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో మాట్లాడేందుకు విపక్ష నేత రాహుల్గాంధీకి అవకాశం ఇవ్వకపోవడం, ఎనిమిది మంది సభ్యులపై సస్పెన్షన్ వేటు వేయడం, కాంగ్రెస్ మహిళా ఎంపీలపై నిరాధార ఆరోపణలు చేసిన భాజపా ఎంపీ నిశికాంత్ దుబెపై చర్యలు చేపట్టకపోవడం వంటి కారణాలతో విపక్షాలు ఈ అవిశ్వాస తీర్మానాన్ని తీసుకొచ్చాయి. ఇందుకోసం 118 మంది ఎంపీల సంతకాలు సేకరించినట్లు తెలుస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ