
ఢిల్లీ, 10,మార్చి (హి.స.)
ఓటరు జాబితా నుంచి అర్హత కలిగిన ఏ ఒక్క ఓటరును తొలగించబోమని కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేశ్ కుమార్ (CEC Gyanesh Kumar) పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల నిమిత్తం సీఈసీ బృందం పశ్చిమబెంగాల్లో (West Bengal) పర్యటించింది. ఈ క్రమంలో రాజకీయ పార్టీలు, అధికారులతో సమావేశాల అనంతరం జ్ఞానేశ్కుమార్ విలేకరులతో మాట్లాడారు.
పశ్చిమబెంగాల్లో స్వేచ్ఛగా, ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా చూడటమే ఎన్నికల సంఘం (EC) మొదటి ప్రాధాన్యం అని అన్నారు. అర్హత ఉన్న ప్రతిఒక్కరూ తమ ఓటు హక్కును ఉపయోగించుకునే అవకాశం ఉంటుందన్నారు. ఈ సందర్భంగా అర్హత కలిగిన ఓటర్ల పేర్లు ఎప్పటికీ తొలగించబోమని స్పష్టంచేశారు. రాజ్యాంగంలోని నిబంధనల ప్రకారమే అన్ని రాష్ట్రాల్లో ‘ప్రత్యేక సమగ్ర సవరణ’ (SIR) అమలవుతుందన్నారు. ఓటర్ల జాబితాలో తప్పులు లేకుండా ఉండటం, అర్హులైన వారి పేర్లు ఆ జాబితాలో ఉండేలా చూడటమే ‘సర్’ బాధ్యత అని అన్నారు. ఇక్కడ ఎన్నికలు ఎన్ని దశల్లో జరుగుతాయనేది.. రాష్ట్రప్రభుత్వం శాంతిభద్రతల విషయంలో చేపట్టే చర్యలపైన ఆధారపడి ఉంటుందన్నారు. బెంగాల్ ఎన్నికల ప్రక్రియలో.. ప్రభుత్వ ఉద్యోగులందరూ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు విధులు నిర్వర్తించాలన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ