
ముంబయి, 12, మార్చి (హి.స.) ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిలో అగ్గి పుట్టింది. అక్కడ అమెరికా-ఇరాన్ మధ్య జరుగుతోన్న దాడులతో చమురు ధరలు మరోసారి భగ్గుమన్నాయి. దాంతో దేశీయ మార్కెట్లు గురువారం భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి (Stock Market Today). సెన్సెక్స్ 900 పాయింట్లకు పైగా పతనమైంది. నిఫ్టీ 24వేల దిగువన కదలాడుతోంది.
ఉదయం 9.37 గంటల సమయంలో సెన్సెక్స్ 894 పాయింట్లు పడిపోయి, 75,986 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 273 పాయింట్లు క్షీణించి, 23,593 వద్ద కొనసాగుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 31 పైసలు కోల్పోయి 92.32గా ఉంది. నిఫ్టీ సూచీలో కోల్ ఇండియా, టెక్ మహీంద్రా, ఓఎన్జీసీ షేర్లు లాభాల్లో ఉండగా.. ఎటర్నల్, ఎంఅండ్ఎం, ఇంటర్గ్లోబ్ ఏవియేషన్, టీఎంపీవీ, శ్రీరామ్ ఫైనాన్స్ స్టాక్స్ నష్టాల్లో ఉన్నాయి.
పశ్చిమాసియాలో కొనసాగుతోన్న ఉద్రిక్తతలతో చమురు సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. దీంతో తమవద్ద ఉన్న వ్యూహాత్మక నిల్వలను విడుదల చేసేందుకు పలు దేశాలు నిర్ణయం తీసుకుంటున్నప్పటికీ.. గురువారం చమురు ధరలు 8 శాతానికిపైగా పెరిగాయి. దాంతో బ్రెంట్ క్రూడ్ 100 డాలర్లు దాటింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రమవుతుండటం బుధవారం అమెరికా మార్కెట్లలో నాస్డాక్ మినహా మిగతా సూచీలన్నీ నష్టాల్లో ముగిశాయి. దాంతో నేటి ట్రేడింగ్లో ఆసియా మార్కెట్లు అదేబాటలో కనిపించాయి. ట్రేడింగ్ ప్రారంభమైన కొన్ని నిమిషాలకే నిఫ్టీ 1.13 శాతం, సెన్సెక్స్ 1.23 శాతం మేర పతనమైంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ