
హైదరాబాద్, 20 మార్చి (హి.స.)
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని
విద్యార్థులు, యువత, దివ్యాంగులకు తీపికబురు చెప్పింది. అసెంబ్లీ (Assembly)లో ప్రవేశపెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్లో భాగంగా విద్యా రంగంతో పాటు సామాజిక భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) కీలక ప్రకటనలు చేశారు. నిరుపేద, వెనుకబడిన వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు, వారికి అన్ని విధాలా అండగా నిలవడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
పారిశ్రామిక శిక్షణ పొందుతున్న యువతను ప్రోత్సహించేందుకు, ఐటీఐ (ITI), ఏటీసీ (ATC)ల్లో చదివే ప్రతి విద్యార్థికి నెలకు రూ.2,000 చొప్పున స్కాలర్షిప్ (Scholarship) అందజేస్తామని మంత్రి స్పష్టం చేశారు. దీనివల్ల సాంకేతిక విద్యను అభ్యసిస్తున్న వేలాది మంది యువతీయువకులకు ఆర్థికంగా ఎంతో ఆసరా లభిస్తుంది. అదేవిధంగా దివ్యాంగ విద్యార్థులకు వారి శారీరక వైకల్యం చదువుకు అడ్డంకి కాకూడదనే ఉద్దేశంతో, ప్రభుత్వం వారికి ఉచితంగా రెట్రో ఫిట్టెడ్ మోటార్ వాహనాలను Retro-fitted Motorized Vehicles) పంపిణీ చేయాలని నిర్ణయించారు. చదువుకోవాలనే తపన ఉన్నప్పటికీ, రవాణా సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్న వారికి ఈ వాహనాలు ఎంతో ఉపయోగపడతాయని మంత్రి భట్టి విక్రమార్క ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇప్పటివరకు పాఠశాల విద్యార్థులకే పరిమితమైన మధ్యాహ్న భోజన పథకాన్ని (Mid Day Meal Scheme), ఇకపై ప్రభుత్వ ఇంటర్మీడియట్ విద్యార్థులకు (Inter Students) కూడా విస్తరిస్తున్నట్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. పౌష్టికాహార లోపం వల్ల విద్యార్థులు ఇబ్బంది పడకుండా, వారి చదువుపై దృష్టి కేంద్రీకరించేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..