
న్యూఢిల్లీ: , 28 మార్చి (హి.స.)మలయాళ సూపర్ స్టార్, లెజెండరీ నటుడు మోహన్ లాల్ వ్యక్తిగత హక్కుల రక్షణ విషయంలో ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం వెలువరించింది. ఆయన పేరు, గొంతు, రూపం లేదా ఇతర గుర్తింపు చిహ్నాలను అనుమతి లేకుండా వాడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. మోహన్ లాల్ వ్యక్తిత్వ హక్కులకు భంగం కలిగించేలా ఆన్లైన్లో ఉన్న కంటెంట్ను వెంటనే తొలగించాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
జస్టిస్ జ్యోతి సింగ్ నేతృత్వంలోని బెంచ్ ఈ పిటిషన్పై విచారణ చేపట్టింది. ఈ క్రమంలో మోహన్ లాల్ అనుమతి లేకుండా ఆయన ఫోటోలను, కంటెంట్ను అప్లోడ్ చేసిన సోషల్ మీడియా ఖాతాలకు సంబంధించిన ‘బేసిక్ సబ్స్క్రైబర్ ఇన్ఫర్మేషన్’ (బీఎస్ఐ) వివరాలను రెండు వారాల్లోగా సమర్పించాలని డిజిటల్ ప్లాట్ఫారమ్లను కోర్టు ఆదేశించింది. అలాగే ఈ వివాదానికి సంబంధించి పూర్తి వివరాలతో కూడిన నివేదికను సమర్పించాలని అన్ని పక్షాలకు సూచించింది.
ముఖ్యంగా ఈ-కామర్స్ ప్లాట్ఫారమ్లపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అనుమతి లేకుండా మోహన్ లాల్ చిత్రంతో కూడిన వస్తువులను విక్రయించడంపై జస్టిస్ జ్యోతి సింగ్ ఘాటుగా ప్రశ్నించారు.
దీనిపై స్పందించిన సదరు ప్లాట్ఫారమ్ ప్రతినిధులు.. ఇప్పటికే ఆ వస్తువులను వెబ్సైట్ నుండి తొలగించినట్లు తెలిపారు. పద్మభూషణ్ తదితర ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్న మోహన్ లాల్.. తన పేరును వాణిజ్య ప్రకటనల్లో లేదా ఏఐ ద్వారా సృష్టించే కంటెంట్లో దుర్వినియోగం చేయకుండా ఉండేందుకు న్యాయపోరాటం చేస్తున్నారు. ఇదివరకే అమితాబ్ బచ్చన్, అనిల్ కపూర్, సోనాక్షి సిన్హా వంటి సినీ దిగ్గజాలు కూడా ఇదే తరహాలో తమ పర్సనాలిటీ రైట్స్ రక్షణ కోసం కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు తదుపరి విచారణను న్యాయస్థానం జూలై 4వ తేదీకి వాయిదా వేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ