
గుజరాత్, 28 మార్చి (హి.స.)
ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో
గ్లోబల్ షిప్పింగ్ మార్గాల్లో అంతరాయాలు ఏర్పడుతున్న వేళ, భారత ఇంధన సరఫరాకు కాస్త ఊరట లభించింది. 47 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీతో కూడిన భారీ ట్యాంకర్ 'జగ్ వసంత్' గుజరాత్లోని వాడినార్ పోర్టుకు (జామ్నగర్) చేరుకుంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఇంధన సరఫరాలో ఆటంకాలు రాకుండా చూసేందుకు అధికారులు వేగంగా చర్యలు చేపట్టారు. సముద్రంలోనే (యాంకరేజ్ వద్ద) 'షిప్ టు షిప్' (STS) విధానం ద్వారా జగ్ వసంత్ నుంచి 'రోజ్ గ్యాస్' అనే మరో నౌకలోకి ఎల్పీజీని విజయవంతంగా బదిలీ చేస్తున్నారు.
అలాగే 45 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీతో 'పైన్ గ్యాస్' ట్యాంకర్ మంగళూరుకు చేరుకోనుంది. అమెరికా నుంచి 18 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీతో వచ్చిన 'పిక్సిస్ పయనీర్' (Pyxis Pioneer) బుధవారమే వాడినార్కు చేరుకోవడం గమనార్హం. ప్రస్తుతం హర్మూజ్ జలసంధిలో 20 భారతీయ ట్యాంకర్లు ఉండగా.. ఇందులో 2.3 లక్షల మెట్రిక్ టన్నుల ఎల్పీజీని మోసుకొస్తున్న 5 ఎల్పీజీ ట్యాంకర్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL) కోసం 50,741 మెట్రిక్ టన్నుల క్రూడాయిల్తో వచ్చిన 'దేశ్ భక్త' నౌక ప్రస్తుతం వాడినార్ పోర్టులో ఉంది. రాబోయే మూడు రోజుల్లో నయారా ఎనర్జీ, ఐఓసీఎల్కు చెందిన దాదాపు 3 లక్షల మెట్రిక్ టన్నుల ముడిచమురుతో మరో మూడు నౌకలు వాడినార్కు రానున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు