
న్యూఢిల్లీ, 28 మార్చి (హి.స.)
దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరా గాంధీ
అంతర్జాతీయ (IGI) విమానాశ్రయంలో ఇవాళ భయానక వాతావరణం నెలకొంది. 160 మంది ప్రయాణికులతో విశాఖపట్నం నుంచి ఢిల్లీ (Delhi)కి వస్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఎయిర్పోర్టు అధికారులు అత్యవసర పరిస్థితిని (Full Emergency) ప్రకటించారు. అయితే, విశాఖ నుంచి బయలుదేరిన ఈ విమానం ఢిల్లీకి చేరువవుతున్న సమయంలో ఓ ఇంజిన్లో సాంకేతిక లోపం తలెత్తినట్లుగా పైలట్లు గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన పైలట్లు ఢిల్లీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC)కి సమాచారం అందించారు. దీంతో విమానాశ్రయంలో అగ్నిమాపక యంత్రాలు, అంబులెన్స్లను సిద్ధం చేసి అత్యవసర ల్యాండింగ్కు ఏర్పాట్లు చేశారు.
ఈ క్రమంలోనే ధైర్యసాహసాలు ప్రదర్శించి పైలట్లు ఎలాంటి ప్రమాదం జరగకుండా విమానాన్ని రన్వేపై సురక్షితంగా ల్యాండ్ చేశారు. అనంతరం ఫ్లైట్లో ప్రయాణికులు, సిబ్బంది అందరూ క్షేమంగా ఉన్నారని అధికారులు వెల్లడించారు. ఇంజిన్ వైఫల్యం వల్లే ఈ సమస్య తలెత్తిందా.. లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో సాంకేతిక నిపుణులు విచారణ చేపట్టారు. ఈ ఘటనతో కాసేపు ఎయిర్పోర్టులో ఇతర విమానాల రాకపోకలకు స్వల్ప అంతరాయం కలిగింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..