
నెల్లూరు, 31 మార్చి (హి.స.)
, కొమ్మరపూడి రైల్వే జంక్షన్ సమీపంలో ట్యాంకర్ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో రెండు ట్యాంకర్ వ్యాగన్లు బోల్తా పడ్డాయి. సమాచారం అందిన వెంటనే రైల్వే అధికారులు, సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ట్యాంకర్ వ్యాగన్లను యధాస్థితికి తీసుకురావడానికి దాదాపు 200 మంది సిబ్బంది, ఉద్యోగులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. గూడ్స్ రైలు విజయవాడ నుంచి తిరుపతి వెళ్తుండగా కొమ్మరపూడి రైల్వే జంక్షన్ వద్ద ఈ ఘటన జరిగింది.
ఈ ప్రమాదం కారణంగా విజయవాడ – తిరుపతి, విజయవాడ – చెన్నై, కొమ్మరపూడి జంక్షన్ – కృష్ణపట్నం మధ్య నడుస్తున్న రైళ్ల రాకపోకలకు తాత్కాలిక అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం కొన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. రైల్వే బృందాలు ట్రాక్ మరమ్మతులు, వ్యాగన్లను తొలగించే పనులను వేగవంతం చేశాయి. పనులను త్వరితగతిన పూర్తి చేసి సాధారణ సేవలు పునరుద్ధరించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ