
హైదరాబాద్, 31 మార్చి (హి.స.)
'హింసకు భవిష్యత్తు లేదు.. శాంతికి
మాత్రమే ఉంది' అంటూ మావోయిస్టు అగ్రనేతలకు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి మరోసారి కీలక విజ్ఞప్తి చేశారు. అజ్ఞాతంలో ఉన్న నేతలు ఆయుధాలు వీడి, గౌరవప్రదమైన జీవితాన్ని ఎంచుకోవాలని కోరుతూ సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. 'ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి, పుసునూరి నరహరి అలియాస్ సంతోష్, వార్తా శేఖర్ అలియాస్ మంగ్డూ, జోడే రత్నబాయి అలియాస్ సుజాత, నక్కా సుశీల అలియాస్ రేల, రంగబోయిన భాగ్య అలియాస్ రూపి'.. వీరంతా తక్షణమే ఆయుధాలు వీడి, తమ కుటుంబాల వద్దకు తిరిగి రావాలని, రక్షణ మరియు భద్రతతో కూడిన మెరుగైన జీవితాన్ని ప్రారంభించాలని కోరారు.
గడిచిన మంది రెండేళ్లలో ప్రభుత్వ పునరావాస విధానం(Rehabilitation Policy) పై నమ్మకంతో 721 మావోయిస్టులు లొంగిపోయి, జనజీవన స్రవంతిలో కలిసినట్లు తెలిపారు. వారంతా ఇప్పుడు ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో తమ జీవితాలను కొత్తగా నిర్మించుకుంటున్నారని పేర్కొన్నారు. లొంగిపోయే వారికి కేవలం పునరావాసం మాత్రమే కాకుండా, గౌరవం, అవకాశాలు, సంరక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి అధునాతన వైద్య చికిత్సలను అందిస్తామని ప్రత్యేకంగా భరోసా ఇచ్చారు. మీ క్షేమం మాకు ముఖ్యం. హింసను వీడి అభివృద్ధి, ప్రజాస్వామ్యం మరియు మెరుగైన రేపటి కోసం కలిసి నడుద్దాం అని పిలుపునిచ్చారు. మావోయిస్టు రహిత సమాజమే లక్ష్యంగా అమిత్ షా నిర్దేశించిన డెడ్లైన్ నేటితో ముగుస్తున్న వేళ, తెలంగాణ ప్రభుత్వం చేసిన ఈ ప్రకటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..