
విజయవాడ,, 31 మార్చి (హి.స.):కనకదుర్గ ఆలయంలో హుండీ కానుకల లెక్కింపులో అక్రమాలు జరిగిన ఘటన వెలుగులోకి వచ్చింది. భక్తులు సమర్పించిన బంగారు కానుకలను సిబ్బంది దారిమళ్లించే ప్రయత్నం చేసినట్లు బయటపడింది.
స్థానికుల సమాచారం ప్రకారం, అసలైన బంగారు వస్తువులను రోల్డ్ గోల్డ్ పేరుతో పక్కన పెట్టి, వాటిని అక్రమంగా మళ్లించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ట్రస్ట్ బోర్డు సభ్యులకు అనుమానం రావడంతో ఆకస్మికంగా తనిఖీలు చేపట్టగా, సిబ్బంది రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డారు.
తనిఖీల్లో భాగంగా సుమారు రూ.1.25 లక్షల విలువైన బంగారు వస్తువులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై దేవస్థానం ఈవో శీనా నాయక్ తీవ్రంగా స్పందించారు. బాధ్యులైన సిబ్బందికి మెమోలు జారీ చేసి, తదుపరి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదిలా ఉండగా, ఆలయంలో సీసీ కెమెరాలు, త్రిసభ్య కమిటీ పర్యవేక్షణ ఉన్నప్పటికీ ఈ తరహా అక్రమాలు ఎలా జరిగాయనే అంశంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసే ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ