
కరీంనగర్, 31 మార్చి (హి.స.)బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు ఇచ్చింది. కౌశిక్ రెడ్డితో పాటు మరో 20 మందికి సీఐడీ అధికారులు నోటీసులు అందజేశారు. ఏప్రిల్ 4న హైదరాబాద్లో విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. జనవరి 29న సమ్మక్క - సారలమ్మ జాతర సందర్భంగా హుజురాబాద్లో కౌశిక్ రెడ్డి హంగామా చేసిన విషయం తెలిసిందే. రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. దీంతో కౌశిక్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. హుజురాబాద్లో నమోదైన కేసును ప్రభుత్వం సీఐడీకి బదిలీ చేసింది. ఈ కేసుపై సీఐడీ అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది. ఇందులో భాగంగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు నోటీసులు ఇచ్చిన సీఐడీ.. ఏప్రిల్ 4న హైదరాబాద్ లక్డీకాపూల్లో ఉన్న సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాల్సిందిగా స్పష్టంగా పేర్కొంది.
సమ్మక్క-సాలరమ్మ జాతర సందర్భంగా కౌశిక్ రెడ్డితో పాటు ఆయన అనుచరులు కూడా ఆందోళన చేశారు. దీంతో వారందరినీ హుజురాబాద్ పోలీస్ స్టేషన్కు పిలిపించి నోటీసులు ఇచ్చారు సీఐడీ అధికారులు. దాదాపు 20 మందికి నోటీసులు అందజేశారు. సీఐడీ నోటీసులపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పందించారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా వేధిస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే సీఐడీ నోటీసులు జారీ చేసిందని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్