
విజయవాడ, 31 మార్చి (హి.స.). విజయవాడ బస్టాండ్ ఎదుట ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడం కలకలం రేపింది. సమయానికి డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో బస్సులో ఉన్న ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు.
రావులపాలెం నుంచి హైదరాబాద్ వెళ్తున్న సాయి ఆర్కే ట్రావెల్స్ కు చెందిన ఈ బస్సు బెజవాడ బస్టాండ్ సమీపానికి చేరుకున్న సమయంలోనే మంటలు చెలరేగాయి. ప్రమాదం సంభవించిన సమయంలో బస్సులో సుమారు 35 మంది ప్రయాణికులు ఉన్నారు. పరిస్థితిని గమనించిన డ్రైవర్ వెంటనే బస్సును ఆపి, ప్రయాణికులను ఒక్కొక్కరిని దిగేలా చేసి ప్రాణాపాయం నుంచి కాపాడాడు.
సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అగ్నిప్రమాదం తీవ్రత పెరిగేలోపే అదుపు చేయడంతో పెద్ద నష్టం తప్పింది. ప్రాథమిక సమాచారం ప్రకారం, బస్సులో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ మంటలు చెలరేగినట్టు అధికారులు భావిస్తున్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. బస్సు యజమానులు, డ్రైవర్ను ప్రశ్నిస్తూ ప్రమాదానికి గల అసలు కారణాలపై ఆరా తీస్తున్నారు. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ