
అమరావతి, 04 మార్చి (హి.స.): పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఏర్పాటైన 12 ఏళ్ల తర్వాత రాజమహేంద్రవరం తరలింపునకు ఆదేశాలు వెలువడ్డాయి. హైదరాబాద్లో ఉన్న ఈ అథారిటీ కార్యాలయాన్ని వెంటనే రాజమహేంద్రవరం తరలించాలని కేంద్ర జలశక్తి శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖ డిప్యూటీ కార్యదర్శి బి.ఎల్ మీనా పోలవరం అథారిటీ ముఖ్య కార్యనిర్వహణాధికారికి లేఖ రాశారు. చీఫ్ ఇంజినీరు, డిజైన్ల విభాగంతో సహా అందరినీ తరలించాలని అందులో పేర్కొన్నారు. కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి కాంతారావు ఈ నెల 27న పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వస్తున్నారని సమాచారం. దీంతో అప్పటిలోగా తరలించాలని భావిస్తున్నారు. ప్రస్తుతం రాజమహేంద్రవరం సమీపంలోని బొమ్మూరులో పోలవరం అథారిటీ కోసం అద్దె భవనం తీసుకున్నారు. రూ.3 లక్షల అద్దె కూడా చెల్లిస్తున్నారు. పోలవరం అథారిటీ చీఫ్ ఇంజినీరు రమేష్కుమార్ రాజమహేంద్రవరం నుంచే పనిచేస్తున్నారు. తాజా ఆదేశాలతో మిగిలిన అన్ని విభాగాలు కూడా ఇక్కడికి రానున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ