
అమరావతి, 04 మార్చి (హి.స.)ఇరాన్.. గల్ఫ్ దేశాలపై చేస్తున్న దాడులతో యుద్ధ పరిస్థితులు నెలకొనగా.. ఆయాదేశాల్లో ఉన్న ప్రవాసాంధ్రులెవరూ ఆందోళన చెందవద్దని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సూచించారు. అసెంబ్లీ సమావేశాల్లో పశ్చిమాసియా పరిస్థితులు, గల్ఫ్ దేశాల్లో ఉన్న ఆంధ్రుల రక్షణపై ఆయన మాట్లాడారు. ప్రవాసాంధ్రుల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తి సహాయం అందిస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం.. గల్ఫ్ దేశాల్లో రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లా ప్రజలు ఎక్కువగా ఉన్నట్లు తెలిసిందన్నారు. అక్కడ నెలకొన్న పరిస్థితులపై ఇక్కడ ఉన్నవారు ఆందోళన చెందవద్దని సూచించారు. గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్నవారికి ఏపీఎన్నార్టీల ద్వారా టెంపరరీగా వసతి, భద్రత, తక్షణ న్యాయసహాయం అందిస్తామని స్పష్టం చేశారు.
గల్ఫ్ లో చిక్కుకున్నవారి కోసం ఢిల్లీలోని ఏపీ భవన్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, ఏపీలో కూడా 24 గంటల కంట్రోల్ రూమ్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఎవరికైనా సమస్యలు ఎదురైతే హెల్ప్ లైన్ 0863 -2340678ను సంప్రదించవచ్చని, లేదంటే వాట్సాప్ నంబర్ +91 85000 27678 నంబర్ ను సంప్రదించాలని సూచించారు. కుదరని పక్షంలో సమస్యలను helpline@apnrts.comకు మెయిల్ చేయాలని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV