
డిల్లీ, 08 మార్చి (హి.స.)
పురుషులకంటే మహిళలే తెలివైనవారని, తాను ముగ్గురు లేడీ బాస్ లు ఉన్న కుటుంబంలో పెరిగానని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం తన ఎక్స్ హ్యాండిల్ లో ఓ వీడియోను షేర్ చేశారు. కొద్దిరోజుల క్రితం కేరళలో లంచ్ ఇంటరాక్షన్ లో కొందరు విద్యార్థినులను కలిసిన సందర్భంగా.. వారితో ముచ్చటించిన విషయాలను పంచుకున్నారు. మహిళల శక్తి సామర్థ్యాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
సమాజపు ఆంక్షలకు లోబడి ఉండొద్దు..
తన కుటుంబానికి నానమ్మ ఇందిరాగాంధీనే బాస్ అన్నారు. తమ ఇంట్లో ఎప్పుడూ మహిళల సంఖ్యే ఎక్కువగా ఉండేదని రాహుల్ పేర్కొన్నారు. పురుషులు తరచుగా తొందరపాటుకు గురవుతారని, చిన్న చిన్న విషయాలకే గుడ్డిగా వ్యవహరిస్తారని విమర్శించారు. మహిళలు మాత్రం దూరదృష్టితో ఆలోచిస్తారని, ప్రత్యక్ష అధికారం కంటే పరోక్ష అధికారాన్ని ప్రయోగిస్తారన్నారు. ఇది మరింత ప్రభావవంతంగా ఉంటుందని రాహుల్ అభిప్రాయపడ్డారు. ప్రతీ మహిళలో సున్నితత్వం, అవగాహన, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉంటాయని, ఇవి సమాజానికి సమతుల్యత, దిశానిర్దేశాన్ని ఇస్తాయని కొనియాడారు. మహిళలు సమాజం విధించే ఆంక్షలకు లోబడకుండా తమ సొంత వ్యక్తిత్వం, ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగే హక్కును కలిగి ఉండాలని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. అలాగే మహిళలు తమ సామర్థ్యాన్ని గుర్తించి ముందుకు సాగితే సమాజంలో అసాధారణ మార్పుల్ని తీసుకురాగలరని ఆశాభావం వ్యక్తం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు