
కోల్కతా, 09 మార్చి (హి.స.)
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ మధ్య రాజకీయ వివాదం మరోసారి తారస్థాయికి చేరింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తమ ప్రభుత్వం అగౌరవం కలిగించిందంటూ ప్రధాని చేసిన విమర్శలకు సీఎం మమత ఒక పాత ఫోటోతో ఘాటుగా బదులిచ్చారు. రాష్ట్రపతి నిలబడి ఉండగా ప్రధాని కూర్చున్న ఫోటోను చూపిస్తూ.. అసలు గౌరవం ఇవ్వనిది ఎవరని ఆమె నిలదీశారు.
మార్చి 7న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బెంగాల్ పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా బాగ్డోగ్రా విమానాశ్రయంలో తనకు స్వాగతం పలికేందుకు ముఖ్యమంత్రిగానీ, కేబినెట్ మంత్రులుగానీ రాకపోవడంపై రాష్ట్రపతి అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన ప్రధాని మోదీ, టీఎంసీ ప్రభుత్వం ఒక గిరిజన మహిళా రాష్ట్రపతిని తీవ్రంగా అవమానించిందని, ఇది సిగ్గుచేటని విమర్శించారు.
ఈ ఆరోపణలను సీఎం మమత తీవ్రంగా ఖండించారు. తాను ప్రజా సమస్యలపై కోల్కతాలో ధర్నాలో ఉన్నందునే రాలేకపోయానని, రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేయర్ హాజరయ్యారని వివరణ ఇచ్చారు. అంతేకాకుండా, 2024 మార్చిలో ఎల్కే అద్వానీకి భారతరత్న పురస్కారం అందించినప్పటి ఫోటోను ఆమె మీడియా ముందు ప్రదర్శించారు. ఆ ఫోటోలో రాష్ట్రపతి నిల్చుని ఉండగా ప్రధాని మోదీ కూర్చుని ఉన్నారని గుర్తుచేస్తూ.. బీజేపీ నేతలు తమకు గౌరవం గురించి నీతులు చెప్పవద్దని ఎదురుదాడికి దిగారు.
ఈ రాజకీయ వివాదం ముదురుతున్న నేపథ్యంలో, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ రంగంలోకి దిగింది. రాష్ట్రపతి పర్యటనలో జరిగిన ప్రోటోకాల్ ఉల్లంఘనలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో ఈ ఘటన పరిపాలనపరంగా కూడా ప్రాధాన్యం సంతరించుకుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV