
విజయవాడ, 13 ఏప్రిల్ (హి.స.)మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై టీడీపీ నేత హనుమంతరావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గత రెండు రోజులుగా సజ్జల అమరావతిపై అవాకులు చవాకులు పేలుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో రాజధాని అమరావతి నిర్మాణంలో ఒక్క ఇటుక రాయి అయినా వేశారా అని ప్రశ్నించారు. చంద్రబాబు సారథ్యంలో ఇప్పుడు రాజధాని అమరావతి శరవేగంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు. ఇది చూసి ఓర్వలేక రాజధాని నిర్మాణంలో అవినీతి జరిగిపోతోందని బోగస్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
రాష్ట్ర ప్రజలు జగన్ను నమ్మే పరిస్థితిలో లేరని టీడీపీ నేత అన్నారు. మూడు ముక్కలాట ఆడి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది జగనే అంటూ వ్యాఖ్యానించారు. ప్రజావేదికను ధ్వంసం చేసి విధ్వంసకర పాలనకు జగన్ నాడే శ్రీకారం చుట్టారని మండిపడ్డారు. జగన్, సజ్జల రాష్ట్ర ప్రజల జీవితాలతో చెలగాటమాడారన్నారు. ప్రజలు 11తో బుద్ధి చెప్పినా ఇంకా డ్రామాలు ఆడుతున్నారన్నారు. హత్యా రాజకీయాలు, దూషణలను ప్రోత్సహించే జగన్కు ప్రజలు మళ్లీ బుద్ధి చెప్పడం ఖాయమని టీడీపీ నేత హనుమంతరావు హెచ్చరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్