
నాగర్ కర్నూల్, 02 ఏప్రిల్ (హి.స.)
నల్లమల అటవీ ప్రాంతంలో
క్షేత్రస్థాయిలో పర్యటించి జాతర ఏర్పాట్లను స్వయంగా నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం పరిధిలోని లింగాల మండలంలోని సుందరమైన నల్లమల అడవులు మధ్య వెలసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సలేశ్వరం లింగమయ్య స్వామి జాతర బుధవారం ఉదయం భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా ప్రారంభమైందన్నారు. ప్రతి సంవత్సరం జరిగే ఈ జాతరకు తెలంగాణతో పాటు పక్క రాష్ట్రాల నుంచి కూడా వేలాది మంది భక్తులు తరలి వస్తుండటం విశేషం. ప్రకృతి సోయగాల నడుమ జరిగే ఈ జాతర భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచుతుందన్నారు.
మూడు రోజుల పాటు కొనసాగే ఈ మహోత్సవాన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లా యంత్రాంగం ముందస్తుగా విస్తృత ఏర్పాట్లు చేపట్టిందని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేస్తుందన్నారు. ముఖ్యంగా తాగునీటి సరఫరా, అన్నదానం, విశ్రాంతి మండపాలు, తాత్కాలిక నివాస సదుపాయాలు వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఏర్పాట్లపై భక్తులతో కలెక్టర్ ఆరా తీశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఏర్పాటు చేసిన క్యూలైన్లు, పార్కింగ్ ప్రాంతాలు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలను వారు సమీక్షించారు. అలాగే సీసీ కెమెరాల ద్వారా నిఘా వ్యవస్థను బలోపేతం చేసి భద్రతను మరింత కట్టుదిట్టం చేశామని, వైద్య సేవల పరంగా కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేయబడినట్లు అధికారులు తెలిపారు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తినా వెంటనే చికిత్స అందించేందుకు మెడికల్ క్యాంపులు, అంబులెన్స్ సదుపాయాలు సిద్ధంగా ఉంచారు.
జాతర మూడు రోజుల పాటు అధికారులు 24 గంటలు పర్యవేక్షణ కొనసాగిస్తారని, ఎలాంటి సమస్యలు తలెత్తినా వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
భద్రత పరంగా ఎటువంటి లోపాలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు