
అమరావతి, 30 ఏప్రిల్ (హి.స.)
పశ్చిమగోదావరి జిల్లాలోని ఆకివీడు రామాలయం నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై ఏపీ హైకోర్టులో ఈరోజు(గురువారం) విచారణ జరిగింది. ఆలయ నిర్మాణాన్ని నిలిపివేయాలంటూ వేసిన పిటిషన్లను పిటిషనర్లు ఉపసంహరించుకున్నారు. రామాలయం నిర్మాణానికి అన్ని అనుమతులు ఉన్నాయని ప్రభుత్వ తరఫు న్యాయవాదులు కోర్టుకు వివరించారు. రామాలయం ప్లాన్తో పాటు ఆర్డీవో, ఎమ్ఆర్వో ఇచ్చిన అనుమతుల వివరాలను తెలిపారు. దీంతో ‘రామాలయం నిర్మాణం చేసుకోవచ్చు కదా’ అని హైకోర్టు వ్యాఖ్యానించింది
ఈ దశలో పిటిషనర్ల తరఫు న్యాయవాది జడ శ్రవణ్ మాట్లాడుతూ.. ‘పిటిషన్ను ఉపసంహరించుకుంటామని’ తెలిపారు. అయితే ప్లాన్ను సవాల్ చేస్తామని స్పష్టం చేశారు. పిటిషన్ ఉపసంహరణకు అనుమతి ఇవ్వాలని కోరగా.. అందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ