నల్లమల అడవుల్లో అరుదైన పీకాక్ టరంటులా సాలీడు... ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
నల్లమల అడవుల్లో అరుదైన పీకాక్ టరంటులా సాలీడు... ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
సాలీడు


అమరావతి, 30 ఏప్రిల్ (హి.స.)

తూర్పు కనుమలకే తలమానికమైన అరుదైన జీవి పరిరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడుం బిగించింది. ప్రపంచవ్యాప్తంగా తీవ్రంగా అంతరించిపోతున్న జాతుల జాబితాలో ఉన్న పీకాక్ టరంటులా (Poecilotheria metallica) అనే సాలీడు పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో, అటవీ శాఖ ఈ కీలక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

నాగార్జున సాగర్ - శ్రీశైలం టైగర్ రిజర్వ్ పరిధిలోని అడవుల్లో ఈస్టర్న్ ఘాట్స్ వైల్డ్లైఫ్ సొసైటీ సహకారంతో ఏపీ అటవీ శాఖ ఈ సాలీడుపై పరిరక్షణ స్థితి సర్వేను ప్రారంభించింది. నీలం రంగులో మెరిసిపోయే ఈ పీకాక్ టరంటులా ప్రపంచంలో కేవలం ఆంధ్రప్రదేశ్లోని తూర్పు కనుమల్లోని చాలా చిన్న ప్రాంతానికి మాత్రమే పరిమితం. ఇది అత్యంత అరుదైన, ప్రత్యేకమైన జీవి కావడంతో దీనిని కాపాడుకోవడం ఎంతో కీలకం.

ఈ సర్వే ద్వారా నల్లమల అడవుల్లో ఈ సాలీళ్ళ జనాభా, విస్తరణ మరియు ఆవాసాల పరిస్థితిని అంచనా వేయనున్నారు. ఈ వివరాల ఆధారంగా వాటి భవిష్యత్తును కాపాడేందుకు పటిష్టమైన పరిరక్షణ ప్రణాళికలు రూపొందిస్తారు. కేవలం పెద్ద జంతువులే కాకుండా, ఇలాంటి అరుదైన, ప్రత్యేకమైన జీవులను కాపాడుకోవడం కూడా జీవవైవిధ్య పరిరక్షణలో ముఖ్య భాగమని అధికారులు తెలిపారు. ఈ దిశగా చేపట్టిన ఈ కార్యక్రమం ఎన్నో మంచి పనులకు నాంది పలుకుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande