
గంగవరం, 06 ఏప్రిల్ (హి.స.) చిత్తూరు జిల్లా గంగవరం మండలం దండపల్లి క్రాస్ (YSR జంక్షన్) వద్ద ఈ ఘోర ప్రమాదం జరిగింది. అతివేగంతో వెళ్తున్న కారు, ముందు వెళ్తున్న కంటైనర్ లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది.
ఢీకొట్టిన వేగానికి కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు అయి లారీ కిందకు దూసుకెళ్లిపోయింది.
ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను తిరుపతి కోర్టులో సీనియర్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న హరీష్, యుగంధర్ లుగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంలో మరో నలుగురు తీవ్రంగా గాయపడగా వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పలమనేరు ఆస్పత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించిన పోలీసులు, కంటైనర్ డ్రైవర్ను విచారిస్తున్నారు.
జాతీయ రహదారిపై జరిగిన ఈ ఘటనతో కొంతసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV