
తాలిపరంబ, 07 ఏప్రిల్ (హి.స.)
ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ మరోసారి తన భక్తిని చాటుకున్నారు. తాలిపరంబలోని చారిత్రాత్మక రాజరాజేశ్వర ఆలయ అభివృద్ధికి ఏకంగా రూ.12 కోట్ల విరాళం ప్రకటించారు. తాజాగా ఆలయాన్ని దర్శించుకున్న ఆయన ఈ విరాలం ప్రకటించారు. ఈ నిధులను ఆలయ పునరుద్దరణ కోసం వినియోగించాలని కోరారు.
ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ ఇటీవల తాలిపరంబలోని చారిత్రాత్మక రాజరాజేశ్వర ఆలయాన్ని సందర్శించారు. ఆలయానికి వచ్చిన ఆయనకు అర్చకుడు ఘన స్వాగతం పలికారు. ఆలయ సందర్శనలో భాగంగా అనంత్ అంబానీ స్వామివారికి పొన్నుంకుడం, పట్టం, తాళి, నెయ్యమృతు వంటి విశేష కానుకలను సమర్పించారు.
అనంతరం అర్చకులు ఆయనకు ఆలయం మొత్తం తిప్పి చూపించారు. అయితే ఆలయ తూర్పు గోపురం దాదాపు రెండు శతాబ్దాలుగా శిథిలావస్థలో ఉందని.. పురాతన కాలం నాటి ఈ కట్టడాన్ని పునరుద్ధరించడానికి ఆలయ అధికారులు గత 25 ఏళ్లుగా ప్రయత్నిస్తున్నప్పటికీ, ఆర్థిక వనరుల కొరత వల్ల ఆ పనులు నెమ్మదిగా సాగుతున్నాయని అనంత్ అంబానీ తెలుసుకున్నారు. వెంటనే స్పందించి, గోపుర పునరుద్ధరణకు అవసరమైన నిధులను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ మేరకు తాజాగా ఆలయ పునరుద్ధరణ కోసం రూ.12 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించారు. ఇందులో భాగంగా పునరుద్ధరణ పనుల కోసం ప్రాథమికంగా రూ. 3 కోట్ల చెక్కును అధికారులకు అందజేశారు. మిగిలిన నిధులను గోపుర నిర్మాణం, భక్తుల సౌకర్యార్థం పార్కింగ్ సదుపాయాల మెరుగుదల కోసం వినియోగించనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV