
ముంబై, 14 మే (హి.స.)
గురువారం స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో
దేశీయ ఈక్విటీ మార్కెట్లు జోరును కనబరుస్తూ ఇన్వెస్టర్లకు భారీ లాభాలను పంచాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలతో పాటు దేశీయంగా వివిధ రంగాల్లో కొనుగోళ్ల మద్దతు లభించడంతో ప్రధాన సూచీలు ఒక శాతానికి పైగా వృద్ధిని నమోదు చేశాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ ఏకంగా 789.74 పాయింట్లు ఎగబాకి 75,398.72 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ 277 పాయింట్లు లాభపడి 23,689.60 వద్ద ముగిసింది.
ఈ రోజు మార్కెట్ ర్యాలీలో.. ఫార్మా, మెటల్ రంగాలు టాప్ పర్ఫార్మర్లుగా నిలిచాయి. నిఫ్టీ ఫార్మా రంగం అత్యధికంగా 2.74 శాతం వృద్ధిని సాధించగా, నిఫ్టీ మెటల్ 2.04 శాతం లాభపడి ఇన్వెస్టర్ల నమ్మకాన్ని చూరగొన్నాయి. వీటితో పాటు బ్యాంకింగ్ రంగం కూడా అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. అటు ప్రైవేట్, ఇటు ప్రభుత్వ రంగ బ్యాంకులు 1.26 శాతం నుండి 1.42 శాతం వరకు పుంజుకొని సూచీలు గరిష్ట స్థాయిల వద్ద ముగియడానికి ప్రధాన కారణమయ్యాయి. స్థూలంగా చెప్పాలంటే, అన్ని కీలక రంగాలు సమష్టిగా రాణించడంతో షేర్ మార్కెట్ లాభాల బాటలో పయనించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు