
సిద్దిపేట, 02 మే (హి.స.)
సిద్దిపేట జిల్లా దుబ్బాకలో శనివారం నిర్వహించిన 'ప్రజా పాలన' కార్యక్రమం రణరంగంగా మారింది. వరి ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వం అవలంబిస్తున్న తీరును నిరసిస్తూ స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ప్రజా పాలన సభలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రసంగిస్తుండగా, మధ్యలోనే మైక్ కట్ అవ్వడంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. తన గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే, చేతిలోని మైకులను వేదికపైనే నేలకేసి కొట్టారు. అనంతరం అధికారుల తీరుకు నిరసనగా అక్కడే నేలపై కూర్చొని వరి ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు.
ఎమ్మెల్యే ధర్నాకు మద్దతుగా బయట ఉన్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఫంక్షన్ హాల్ లోపలికి చొచ్చుకువచ్చే ప్రయత్నం చేశారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో తోపులాట చోటుచేసుకుంది. చివరకు గేట్లను తోసుకుంటూ లోపలికి వచ్చిన బీఆర్ఎస్ శ్రేణులు, ఎమ్మెల్యేతో కలిసి ధర్నాలో పాల్గొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ ఎత్తున నినాదాలు చేయడంతో హాల్ అంతా హోరెత్తిపోయింది. కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, తాలు, తరుగు పేరుతో వేధిస్తున్నారని ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. రైతుల ధాన్యం పూర్తిగా కొనే వరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు. ప్రజా సమస్యలు చెప్పుకునే వేదికపైనే ప్రజాప్రతినిధికి అవమానం జరగడంపై బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం దుబ్బాకలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..