
ఆదోని, 02 మే (హి.స.)
సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మాతృమూర్తి గౌరమ్మ (100) అనారోగ్యానికి గురికావడంతో శుక్రవారం కన్నుమూశారు. కర్నూలు జిల్లా ఆలూరు మండలం మొలగవల్లికి చెందిన ఆమె మృతి పట్ల రాష్ట్ర రాజకీయ ప్రముఖులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు రామకృష్ణ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
రామకృష్ణ గారి మాతృమూర్తి గౌరమ్మ మృతి పట్ల సీఎం చంద్రబాబు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని ప్రార్థించారు. ఈ విషాద సమయంలో రామకృష్ణ, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
గౌరమ్మ గారు కన్నుమూశారని తెలిసి తీవ్రంగా చింతిస్తున్నానని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని ప్రార్థిస్తూ.. రామకృష్ణ, ఇతర కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
మంత్రి నారా లోకేష్
రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ.. గౌరమ్మ గారి మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. ఆమె స్మృతికి నివాళులు అర్పిస్తూ, ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. రామకృష్ణ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV