
కృష్ణా, 02 మే (హి.స.)
ఉమ్మడి కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షుడు, ఆ పార్టీ సీనియర్ రాజకీయ నాయకుడు వల్లభనేని బాబూరావు తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, గుడ్లవల్లేరులోని తన స్వగృహంలో కన్నుమూశారు. బాబూరావు మరణవార్త తెలియగానే కృష్ణా జిల్లా వ్యాప్తంగా విషాద ఛాయలు అలముకున్నాయి. కూటమి నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో గుడ్లవల్లేరు చేరుకుని ఆయన భౌతిక కాయానికి నివాళులర్పిస్తున్నారు.
వల్లభనేని బాబూరావు తెలుగుదేశం పార్టీ స్థాపన కాలం నుంచే పార్టీలో అత్యంత కీలక పాత్ర పోషించారు. ఎన్టీఆర్ కాలం నుంచి చంద్రబాబు నాయకత్వం వరకు పార్టీ పట్ల తిరుగులేని విధేయతను చాటుకున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా సుదీర్ఘకాలం పనిచేసిన ఆయన, జిల్లాలో పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడంలో కీలక భూమిక పోషించారు. పార్టీ కార్యకర్తలకు మరియు నాయకులకు మధ్య వారధిలా ఉండేవారని ఆయనకు పేరుంది.
ఆయన మరణం కేవలం ఒక పార్టీకే కాకుండా, జిల్లా రాజకీయాలకే తీరని లోటని నాయకులు పేర్కొన్నారు. విలువలతో కూడిన రాజకీయం చేసిన బాబూరావు మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi