
హైదరాబాద్, 03 మే (హి.స.)
కేంద్ర ప్రభుత్వ నిధులతోనే తెలంగాణ ప్రభుత్వం నడుస్తోందని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ నేతలు చిప్ప చేతుల్లో పట్టుకుని ఢిల్లీలో కేంద్ర మంత్రుల చుట్టూ తిరుగుతూ ఇక్కడికి వచ్చాక మాత్రం మళ్లీ మా పైనే విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. కేంద్రం ఎలాంటి సహకారం అందించకపోతే మరి ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నట్లు అని ప్రశ్నించారు. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. నన్ను చీల్చినా పైసా వెళ్లదని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినే చెప్పారన్నారు. చాలా మంది కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో కేంద్ర మంత్రుల చుట్టూ తిరుగుతున్నారు. మీకు వారు చాయ్ ఇస్తున్నారు. కేంద్రంతో సత్సంబంధాలు పెట్టుకోవడం మంచిదే కానీ అక్కడ వారిని కలిసి వచ్చి ఇక్కడ ఏమీ ఇవ్వలేదు అన్నట్లు మాట్లాడుతున్నారు. మీరు ఎంత విమర్శించినా బీజేపీ తెలంగాణ ప్రజలకు మేలు చేస్తూనే ఉంటుందన్నారు. బీజేపీని గత ముఖ్యమంత్రి ఇలాగే విమర్శలు చేస్తే ఆయన్ను ప్రజలు పదవి నుంచి తొలగించారన్నారు.
కేంద్రానికి తాము రూపాయి ఇస్తే రాష్ట్రానికి కేంద్రం నుంచి తిరిగి వస్తున్నది కేవలం రూ.30 పైసలు మాత్రమేనని వస్తున్న విమర్శలపై స్పందిస్తూ.. తెలంగాణలో హైదరాబాద్ జిల్లా ఎక్కువ పన్నులు చెల్లిస్తోంది. మరి వచ్చిన ఆదాయం అంతా హైదరాబాద్. ఖర్చు చేస్తున్నారా అని ప్రశ్నించారు. కేంద్రం నిధులు రాష్ట్రాలకు కేటాయింపు చేసేది నరేంద్ర మోడీ, మన్మోహన్ సింగ్, ఇందిరాగాంధీ కాదన్నారు. ఫైనాన్స్ కమిషన్ ఈనిధుల కేటాయింపు చేస్తుందన్నారు. మోడీ ప్రభుత్వం వచ్చాక తెలంగాణకు పన్నుల్లో వాటా పెంచామన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..