
హైదరాబాద్, 03 మే (హి.స.)
ప్రముఖ సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్(Bandla Ganesh) కుమార్తె జనని నిశ్చితార్థ వేడుక ఆదివారం హైదరాబాద్(Hyderabad)లో వైభవంగా జరిగింది. ఈ వేడుకకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Ap Cm Chandrababu Naidu)దంపతులతో పాటు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు(Former Vice President Venkaiah Naidu), మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) వంటి దిగ్గజాలు హాజరై సందడి చేశారు. అయితే ఈ శుభకార్యంలో రాజకీయ వైరాన్ని పక్కన పెట్టి చోటుచేసుకున్న ఒక ఆత్మీయ సన్నివేశం అందరి దృష్టిని ఆకర్షించింది.
నిశ్చితార్థ వేడుకకు దాదాపు ఒకే సమయంలో వచ్చిన సీఎం చంద్రబాబు, బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఎదురుపడ్డారు. చంద్రబాబును చూడగానే ఎర్రబెల్లి ఎంతో మర్యాదపూర్వకంగా ఆయన వద్దకు వెళ్లి, చేతులు పట్టుకుని వినమ్రంగా నమస్కరించారు. దీనికి స్పందించిన చంద్రబాబు సైతం ఎంతో ఆత్మీయంగా ఎర్రబెల్లి భుజం తట్టి, నవ్వుతూ పలకరించారు. ఇరువురు నేతలు కుశలప్రశ్నలు వేసుకుంటూ కాసేపు ముచ్చటించడం అక్కడ ఉన్నవారికి కనువిందు కలిగించింది.
గతంలో తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయకత్వంలో సుదీర్ఘ కాలం పనిచేసిన అనుబంధం ఎర్రబెల్లికి ఉంది. రాజకీయ పరిణామాల వల్ల ప్రస్తుతం వారు వేర్వేరు పార్టీల్లో ఉన్నప్పటికీ, ఒక సామాజిక వేదికపై పాత బంధాన్ని గుర్తు చేసుకుంటూ వారు ప్రదర్శించిన ఆత్మీయత రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. ఈ అరుదైన సన్నివేశం రాజకీయాల్లో సిద్ధాంతాలు వేరైనా, వ్యక్తిగత సంబంధాలు ఉన్నతమైనవని మరోసారి నిరూపించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..