
హైదరాబాద్, 03 మే (హి.స.)
ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని యధావిధిగా కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో బీసీ సంక్షేమ సంఘం నేతలు జిల్లపల్లి అంజి, నీలం వెంకటేష్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని నిర్వీర్యం చేసిందుకు కుట్రలు చేస్తుందని ఆరోపించారు. ఫీజుల రియంబర్స్ మెంట్ స్కీం ను నీరుగార్చడానికె జీవో నెంబర్ 7ను ప్రభుత్వం తీసుకువచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైకోర్టు లో అడ్వకేట్ జనరల్ బలమైన వాదనలు వినిపించలేదని మండిపడ్డారు. విద్యార్థుల నుంచే కాలేజీలు నేరుగా ఫీజులు వసూలు చేసుకోవచ్చని తీర్పులు వస్తుంటే బీసీ మంత్రులు, ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్ దృష్టి లో పెట్టుకొని పెండింగులో ఉన్న ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో వచ్చేనెలలో 5 లక్షల మంది విద్యార్థులతో కలసి సీఎం ఇల్లును ముట్టడిస్తామని హెచ్చరించారు. సమావేశంలో బీసీ ఐక్య వేదిక అధ్యక్షుడు అనంతయ్య, బీసీ నేతలు మల్లేష్, రాజేందర్, రాకేష్ దత్తా, నిఖిల్, శివ కుమార్ పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..