
హైదరాబాద్, 03 మే (హి.స.)
ఔటర్ రింగ్ రోడ్డుపై ఇటీవల
జరుగుతున్న ప్రమాదాల నేపథ్యంలో హైదరాబాద్ సీపీ సజ్జనార్ అలర్ట్ అయ్యారు. ఈ మేరకు ఆయన ఆదివారం వాహనదారులకు కీలక భద్రతా సూచనలు చేశారు. బ్రేక్ డౌన్ వంటి అనివార్య కారణాలు మినహా, ఓఆర్ఆర్ పై ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలను నిలపవద్దని సూచించారు. ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో వాహనం ఆపాల్సి వస్తే, తక్షణమే 14449 హెల్ప్ లైన్ నంబర్కు సమాచారం అందించి, తగిన భద్రతా ఏర్పాట్లు పూర్తయ్యాకే వాహనాన్ని ఎడమ వైపు చివరి లేన్లో నిలపాలని స్పష్టం చేశారు. ఈ జాగ్రత్తలు కేవలం ఓఆర్ఆర్ కే పరిమితం కాదని గుర్తించాలని, ఏ జాతీయ రహదారి పై(National Highway) ప్రయాణించేటప్పుడైనా ఈ నియమాలను విధిగా పాటించడం అత్యంత కీలకం అని తెలిపారు. ప్రతి సంస్థ కూడా తమ డ్రైవర్లకు, సిబ్బందికి ఈ భద్రతా ప్రోటోకాల్స్పై పూర్తిస్థాయి అవగాహన కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఘోర రోడ్డు ప్రమాదాలను నివారించడానికి మనమందరం బాధ్యతగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ప్రమాదాల నియంత్రణలో పోలీసులకు సహకరించి, మీ ప్రయాణాన్ని సురక్షితం చేసుకోవాలని కోరారు. నిబంధనలు అతిక్రమించి రహదారిపై అకారణంగా వాహనాలు నిలిపే వారిపై కఠిన చర్యలతో పాటు భారీ జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. మీ భద్రతే మా బాధ్యత. సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోండి.. అని కీలక సూచనలు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..