
కర్నూలు, 03 మే (హి.స.)
: తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలకు తోడు ఇప్పుడు చికెన్ ధరలు కూడా సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. వేసవి తీవ్రత దృష్ట్యా పౌల్ట్రీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లు నేరుగా వినియోగదారుడి జేబుపై ప్రభావం చూపుతున్నాయి. మారుతున్న వాతావరణ పరిస్థితులు, ముఖ్యంగా రికార్డు స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతల వల్ల పౌల్ట్రీ ఫామ్స్లో కోళ్లు పెద్ద సంఖ్యలో మరణిస్తున్నాయి. అధిక వేడిని తట్టుకోలేక కోళ్లు మృత్యువాత పడటంతో మార్కెట్కు అందాల్సిన సరఫరా ఒక్కసారిగా పడిపోయింది. సాధారణంగా వేసవిలో డిమాండ్ కొంత తక్కువగా ఉన్నప్పటికీ, ఈసారి సరఫరా మరీ తక్కువగా ఉండటంతో కేవలం వారం వ్యవధిలోనే కిలో చికెన్పై రూ. 40 వరకు ధర పెరగడం గమనార్హం. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా వరంగల్, నిజామాబాద్ వంటి జిల్లాల్లో ధర రూ. 270 పలుకుతుండగా, హైదరాబాద్ వంటి నగరాల్లో ఇది రూ. 280 కి చేరింది. ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. శ్రీకాకుళం, పిఠాపురం వంటి ప్రాంతాల్లో ఏకంగా రూ. 300 మార్కును తాకడం సామాన్య వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తోంది. ఎండలు తగ్గి, కొత్త బ్యాచ్ కోళ్లు మార్కెట్కు వచ్చే వరకు చికెన్ ప్రియులకు ఈ ధరల సెగ తప్పేలా లేదు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV